🚨 రోడ్డే చెత్తకుప్పగా మారింది... దుర్గంధంతో అల్లాడుతున్న ఏఎస్ రావు నగర్ ప్రజలు
🚨 ఈ మురికి ఎన్నాళ్లు..? పరిష్కరించే నాథుడే లేరా..?
నారాయణఖేడ్ | జూలై 2 | తెలంగాణ స్రవంతి ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఏఎస్ రావు నగర్ కాలనీలో పారిశుద్ధ్య సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. కాలనీలోని కొందరు నివాసితులు ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు చెత్తను అందించకుండా, నేరుగా ప్రధాన రహదారిపైనే పారబోస్తుండటంతో ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా మారింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ప్రజలకు నిత్యం నరకయాతన
రోడ్డుపై పేరుకుపోయిన చెత్త వద్దకు పందులు, వీధి కుక్కలు చేరుకుని చెత్తను మరింత చెల్లాచెదురు చేస్తున్నాయి. దీంతో రహదారిపై ప్రయాణించే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెత్త కుళ్లిపోవడంతో దుర్వాసన మరింత పెరిగి, దోమలు, ఈగలు అధికమై అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలని విజ్ఞప్తి
కాలనీలో చిన్నారులు, వృద్ధులు అధికంగా నివసిస్తున్నందున పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. రోడ్డుపై చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి ఇంటి నుంచి చెత్తను మున్సిపల్ సిబ్బందికే అందించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ప్రశ్న ఇదే...
"ఈ మురికి ఎన్నాళ్లు..? సమస్యను పరిష్కరించే నాథుడే లేరా..?" అంటూ ఏఎస్ రావు నగర్ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలనీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
.png)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి