బిల్లు చెల్లించలేదని ప్రభుత్వ పాఠశాలకు తాళం... బయటే నిలిచిపోయిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
11 లక్షల బిల్లు బకాయిపై హైడ్రామా… ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని దానవాయిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మన ఊరు – మన బడి పథకం కింద చేపట్టిన మరమ్మత్తుల పనులకు సంబంధించిన బిల్లు చెల్లించలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ అయోధ్య పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేశారు.
గేటు బయటే నిలిచిపోయిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
గేటుకు తాళం వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలోకి వెళ్లలేక బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రూ.11 లక్షల బిల్లు చెల్లించాలని డిమాండ్
మన ఊరు – మన బడి పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి రూ.11 లక్షల బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లిస్తేనే గేటు తాళం తీస్తానని కాంట్రాక్టర్ డిమాండ్ చేసినట్లు సమాచారం. బిల్లు మంజూరు చేయకపోతే ఆత్మాహుతి యత్నానికి పాల్పడతానంటూ హెచ్చరించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు
పరిస్థితిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఉపాధ్యాయులు, సమస్య పరిష్కారం కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఘటనపై అధికారులు స్పందించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి