గూడూరు మండలంలో అవినీతి బండారం బట్టబయలు… లంచం తీసుకుంటూ హెడ్మాస్టర్ ఏసీబీకి చిక్కాడు
👉 ₹50 వేల లంచం స్వీకరిస్తూ పట్టుబాటు
👉 మరో స్కూల్ అసిస్టెంట్ కూడా అదుపులో
👉 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం భారీ డిమాండ్ ఆరోపణ
మహబూబాబాద్,
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరు మండల ఇంచార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న అయోధ్యపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సమాచారం ప్రకారం, గూడూరు మండలంలోని వాగ్య తండాకు చెందిన ఉపాధ్యాయుడు రవీందర్ ఈ నెల 30న రిటైర్మెంట్ పొందనుండగా, తన సేవా ప్రయోజనాలకు సంబంధించిన ఫైల్స్పై సంతకం చేయాలని రవికుమార్ను సంప్రదించాడు. అయితే ఈ ప్రక్రియ కోసం రూ.1,50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.50 వేల లంచం స్వీకరిస్తుండగా రవికుమార్ను పట్టుకున్నారు. ఈ ఘటనలో మరో స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి కూడా సంబంధం ఉన్నట్లు భావించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో విద్యా శాఖలో అవినీతి వ్యవహారాలు మళ్లీ వెలుగులోకి రావడం గమనార్హం. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి