దిశా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే జారె గట్టి స్వరం… అమలులో లోపాలపై హెచ్చరిక


👉 కేంద్ర పథకాలపై కఠిన సమీక్ష

👉 అర్హులందరికీ లబ్ధి చేరాలని స్పష్టం

👉 గ్రామీణ సమస్యల పరిష్కారానికి అధికారులకు డెడ్‌లైన్


చండ్రుగొండ, ఏప్రిల్ 08


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశం ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు, జిల్లా దిశా కమిటీ అధ్యక్షుడు రామసహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రగతి, వాటి అమలు విధానం, ప్రజలకు అందుతున్న లబ్ధి పై సమగ్ర సమీక్ష నిర్వహించారు.


ఈ సమావేశానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరై తన నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.


“పథకాలు ప్రకటించడం ఒక్కటే కాదు… అవి ప్రజల చేతుల్లోకి చేరాలి” అని పేర్కొంటూ అమలులో నిర్లక్ష్యం ఉంటే సహించబోమని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. పథకాల అమలులో ఆలస్యం, లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.


నియోజకవర్గంలో రహదారుల దుస్థితి, తాగునీటి కొరత, గృహనిర్మాణ పనుల మందగమనం వంటి సమస్యలపై ఎమ్మెల్యే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాల్లో సేవలు మెరుగుపరచాలని, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


పోడు భూముల సమస్యలు, విద్యుత్ సరఫరా లోపాలు, ఆరోగ్య సేవల కొరత వంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


“ప్రజల నమ్మకమే ప్రభుత్వానికి బలం… ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి అధికారికి బాధ్యత” అని పేర్కొంటూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.


సమావేశంలో అధికారులు తమ శాఖల పనితీరుపై వివరాలు సమర్పించగా, లోపాలున్న చోట తక్షణ సవరణలు చేపట్టాలని సూచనలు జారీ అయ్యాయి. ప్రజలకు అందే ప్రతి సేవలో పారదర్శకత, వేగం ఉండాలని స్పష్టం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం