పంట అవశేషాలను కాల్చొద్దు… రైతులకు మధిర రూరల్ సీఐ మధు హెచ్చరిక
పంట అవశేషాలను కాల్చొద్దు… రైతులకు మధిర రూరల్ సీఐ మధు హెచ్చరిక
అగ్ని ప్రమాదాల నివారణకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: రైతులు పంటల అవశేషాలను కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించి పంటలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని మధిర రూరల్ సీఐ డీ. మధు హెచ్చరించారు. అగ్ని ప్రమాదాల నివారణకు రైతులు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
బోనకల్ – మధిర రూరల్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలతో సమావేశం
గురువారం తన కార్యాలయంలో బోనకల్, మధిర రూరల్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలతో సీఐ మధు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంట కోతల అనంతరం మిగిలిన అవశేషాలను కాల్చడం వల్ల సమీప పొలాల్లో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు.
విద్యుత్ లైన్లు, పశువులకు ప్రమాదమని హెచ్చరిక
పంట అవశేషాలను కాల్చడం వల్ల విద్యుత్ లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని, పశువులకు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సీఐ పేర్కొన్నారు. రైతులు నిర్లక్ష్యం వహిస్తే భారీ ఆర్థిక నష్టాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు.
పర్యావరణానికి తీవ్ర ముప్పు
పంట అవశేషాల దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదలై గాలి కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.
భూసారం తగ్గి రైతులపై అదనపు భారం
దహనం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం, నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ వంటి కీలక పోషకాలు నశించి భూసారం తగ్గిపోతుందని సీఐ మధు తెలిపారు. దీంతో రైతులు అధికంగా రసాయన ఎరువులపై ఆధారపడాల్సి రావడంతో ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు.
ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని సూచన
రైతులు పంట అవశేషాలను కాల్చకుండా రోటవేటర్ ద్వారా నేలలో కలియదున్నడం, కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, పశుగ్రాసంగా వినియోగించడం, మల్చింగ్ పద్ధతులు అనుసరించడం వంటి ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ఆయన సూచించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి