అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేసిన ఘటన కలకలం…
👉 రాసోల్ గ్రామంలో అమానుష ఘటన
👉 బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
👉 సంఘాల ఆందోళన, న్యాయం కోరుతూ వినతి
నారాయణఖేడ్, ఏప్రిల్ 09
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేసి వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం కలకలం రేపింది. వ్యక్తిగత అప్పు వివాదం పేరుతో మహిళపై అమానుషంగా వ్యవహరించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాల ప్రకారం… పంచమహల్ దామరగిద్ద గ్రామానికి చెందిన ఓ మహిళ రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 7న విధులకు వెళ్లిన సమయంలో, అదే గ్రామానికి చెందిన సాయవ్వ, చాకలి బాలవ్వ, వైద్యనాథ్ తదితరులు ఆమెను అడ్డుకున్నారు.
ఆమె భర్త ప్రభాకర్ రావు హెచ్బీఎన్ ఫైనాన్స్ పేరిట తమ వద్ద నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ, డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం కోర్టులో పెండింగ్లో ఉందని బాధితురాలు చెప్పినా, వారు వినిపించుకోలేదు.
ఆ తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారి, బండెప్ప, కోటగిరి రాములు కలిసి ఆమెను చెట్టుకు కట్టేసి నిర్బంధించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, డబ్బులు చెల్లించకపోతే ఊరేగిస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భయంతో వణికిపోయిన బాధితురాలు, సమస్య పరిష్కారం కాకపోతే భూమి అమ్మి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో సుమారు గంట తర్వాత ఆమెను విడిచిపెట్టినట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై కార్మిక సంఘాలు, అంగన్వాడీ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించి, బాధ్యులపై కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ఉమా హారతిని కలిసి వినతిపత్రం అందజేశారు.
“అప్పు వివాదం పేరుతో మహిళను చెట్టుకు కట్టేయడం అనాగరికం… ఇలాంటి చర్యలు సమాజంలో భయాందోళనలు కలిగిస్తాయి” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని సంఘాలు హెచ్చరించాయి.
👉 మరిన్ని వివరాలు కోసం:
🔗 https://telanganasravanti.in

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి