“అసైన్మెంట్ భూముల కబ్జా ఆరోపణలు: ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలపై ప్రజావాణిలో ఫిర్యాదు… చర్యలు లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష హెచ్చరిక”
తెలంగాణ స్రవంతి ప్రతినిధి, జుక్కల్:
మద్నూర్ మండల పరిధిలో అసైన్మెంట్ భూమి కబ్జా చేశారనే ఆరోపణలతో ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలపై సోనాల గ్రామానికి చెందిన కాలె వెంకట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ విషయంపై అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.
కాలె వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం, సలాబత్పూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 12లో ఉన్న అసైన్మెంట్ భూమిని, అలాగే తహశీల్దార్ కార్యాలయం సమీపంలో సర్వే నంబర్ 3లో ఉన్న ప్లాట్ నెంబర్ 4ను ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు.
ఈ విషయమై ఇప్పటికే జనవరి 24న కామారెడ్డి జిల్లా కలెక్టర్కు కూడా వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మండల పరిధిలోని ఈ రెండు ప్లాట్లను కబ్జా చేసి వాటిని తమ తల్లి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపిస్తూ, ఆధారాలుగా చూపించేందుకు ఆ స్థలాలకు పన్నులు కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు.
“పేదల కోసం కేటాయించిన అసైన్మెంట్ భూములను కబ్జా చేయడం చట్టవిరుద్ధం. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులే ఇలా వ్యవహరిస్తే సాధారణ ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది?” అని కాలె వెంకట్ ప్రశ్నించారు.
ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి ఆరోపణలు నిజమైతే సంబంధిత వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారనే అంశం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి ✍️

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి