🔥 “మిర్చి అగ్నికి ఆహుతి… మార్కెట్ ధరకు నష్టపరిహారం ఇవ్వాలి: సిపిఐ నేత బెజవాడ రవి”
తెలంగాణ స్రవంతి ప్రతినిధి, మధిర:
మధిర పరిధిలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రైతులు నిల్వ ఉంచిన మిర్చి నిలువలు అగ్నికి ఆహుతి కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు కోల్డ్ స్టోరేజ్లో భద్రపరచిన రైతులు ఒక్కసారిగా భారీ నష్టాన్ని ఎదుర్కొని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన సిపిఐ నాయకుడు బెజవాడ రవి, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. “రైతులు కష్టపడి పండించిన పంట ఇలా అగ్నికి ఆహుతి కావడం అత్యంత దురదృష్టకరం. ఈ నష్టాన్ని రైతులు భరించే స్థితిలో లేరు” అని అన్నారు.
అగ్ని ప్రమాదం ఏ కారణంతో జరిగిందో పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్లో మిర్చి నిల్వ ఉంచిన ప్రతి రైతుకు ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా పూర్తి నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.
రైతులకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం కూడా బాధ్యత తీసుకొని రైతులకు నష్టం కలగకుండా తగిన పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు.
ఈ ఘటనతో రైతుల్లో భద్రతపై ఆందోళన పెరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కోల్డ్ స్టోరేజ్లలో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
🌐 మరిన్ని వివరాలకు: https://telanganasravanti.in�
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి ✍️

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి